Site icon Polytricks.in

పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ – బీజేపీలోకి చిరంజీవి..?

తెలంగాణలో బీజేపీ బలపడుతున్నా ఏపీలో మాత్రం ఆశించిన స్థాయిలో పుంజుకోలేకపోతోంది. అడపాదడప నేతలు చేరుతున్నా వారితో పార్టీకి పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. దీంతో పెద్ద తలకాయలపై ఫోకస్ పెట్టింది. సినీతారలను బీజేపీలో చేర్చుకొని ఏపీలో ఓటు బ్యాంక్ ను పెంచుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందుకే వరుసగా సినీ హీరోలు, సీనియర్ నటిలను బీజేపీలో చేర్చుకునేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే నితిన్ , జూనియర్ ఎన్టీఆర్ , ప్రభాస్ లను ఆ మధ్య బీజేపీ అగ్రనేతలు కలిసినట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఏపీలో కాపులను తమ వైపు తిప్పుకునేందుకు చిరంజీవికి బీజేపీ గాలం వేస్తోంది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ద్వారా చిరంజీవిని బీజేపీలో చేర్చుకోవాలని ప్లాన్ వేసింది. తాజాగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చిరంజీవిని కలవడం, చర్చించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

చిరంజీవి 2009లో ప్రజారాజ్యం ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. భారీ అంచనాలతో ఎన్నికలకు వెళ్ళినా కేవలం 18సీట్లకే మాత్రమే ప్రజారాజ్యం పరిమితమైంది. ఆ తరువాత పార్టీ బలహీనం కావడంతో పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేసారు. ఫలితంగా చిరంజీవికి కేంద్రమంత్రి పదవిని కట్టబెట్టారు. రాష్ట్ర విభజన వలన కాంగ్రెస్ పార్టీ కకావికలం కావడం.. రాజ్యసభ పదవి కాలం ముగియడంతో రాజకీయాలపై చిరు ఇంట్రెస్ట్ ను తగ్గించేశారు. కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా రాజీనామా చేయకున్నా.. పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు పూర్తిగా సినిమారంగం వైపే ఉన్నారు. పవన్ కళ్యాణ్ జనసేనలోనూ ఆయన చేరడం లేదు. ఆ పార్టీకి తన మద్దతు ఉన్నట్లు కూడా ప్రకటించలేదు.

చిరంజీవిని ఎలాగైనా బీజేపీ లాక్కోవాలని ట్రై చేస్తోంది. మోడీ తో సహా కీలక నేతలంతా చిరంజీవి వైపు ఆసక్తి చూపిస్తున్నారు. మెగాస్టార్ కమలం తీర్ధం పుచ్చుకుంటే ఏపీలో కాపుల ఓటు బ్యాంక్ బీజేపీ ఖాతాలో పడుతుందని నమ్మకంగా ఉన్నారు. గత ఏడాది గోవాలోని ఐఎఫ్‌ఎఫ్‌ఐలో భారత ప్రభుత్వం అతనికి పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో సత్కరించింది. ఆ సమయంలో మంత్రి అనురాగ్ ఠాకూర్ చిరంజీవిని బీజేపీలోకి ఆహ్వానించారు. కానీ ఆయన తిరస్కరించారు. ఆ తరువాత ప్రధాని మోదీ భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణకు వచ్చినప్పుడు చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం అందింది. అప్పట్లోనూ చిరును బీజేపీలోకి ఆహ్వానించారన్న ప్రచారం కూడా జరిగింది.

ఇప్పుడు తాజాగా మంత్రి అనురాగ్ ఠాకూర్ చిరంజీవి ఇంటికి రావడం చర్చనీయాంశం అవుతోంది. గత ఏడాది గోవాలోని ఐఎఫ్‌ఎఫ్‌ఐలో భారత ప్రభుత్వం అతనికి పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో సత్కరించినందున, చిరు అనురాగ్‌ను మర్యాదపూర్వకంగా ఆహ్వానించారని ప్రచారం జరుగుతోంది. ఈ చర్చల్లో నాగార్జున, అల్లు అరవింద్ సైతం పాలుపంచుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే అనురాగ్ ఠాకూర్ కేంద్ర పెద్దల దూతగా వచ్చారని.. కీలక ప్రతిపాదనలు చిరంజీవి ముందు పెట్టారని టాక్ నడుస్తోంది.

Exit mobile version