బయటి ప్రపంచానికి రైతు బాంధవుడిగా కనిపించే చక్రధర్ గౌడ్ లో ఎవరికీ కనిపించని మరో రూపం దాగి ఉందా..? సంఘ సంస్కర్తగా కలరింగ్ ఇచ్చిన చక్రధర్ గౌడ్ అసాంఘీక కార్యకలాపాలు కూడా కొనసాగించారా..? ఇటీవలి తన స్నేహితుడి భార్యపై అత్యాచారయత్నం కేసులో పట్టుబడిన చక్రధర్ గౌడ్ ఈ సంఘటనతో తన అసలు రంగు బయటపడుతుందనే బీజేపీలో చేరారా..?అంటే అవుననే సమాధానం వస్తోంది.
గాదగోని చక్రధర్ గౌడ్.. ఈ మధ్య కాలంలో సిద్ధిపేట రాజకీయాల్లో విపరీతంగా వినిపిస్తోన్న పేరు. సిద్ధిపేటలో నివాసమంటూ రియల్ ఎస్టేట్ బిజినెస్ తో ఆర్థికంగా బలంగా ఎదిగాడు. ఆ తరువాత ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్ అనే సంస్థను ప్రారంభించి కౌలు రైతులకు ఆర్ధిక సాయం అందించి తెలంగాణ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రభుత్వం ఇచ్చే ‘రైతుబందు’కేవలం భూసాములకు మాత్రమే మేలు చేసే పథకమని…స్వచ్చందంగా తాను రైతు బంధును వదులుకుంటున్నట్లు ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ నేపథ్యంలోనే తనకు ప్రజా సేవ చేయాలనుందని వచ్చే ఎన్నికల్లో సిద్ధిపేట నుంచి పోటీ చేస్తానని ప్రకటించాడు. ఈ క్రమంలోనే ఓ రోజు తన స్నేహితుడి భార్యపై అత్యాచారయత్నం చేసి అరెస్ట్ అయ్యాడు.
స్నేహితుడి భార్యపై అత్యాచారయత్నం చేసినట్లు అంగీకరించిన చక్రధర్ తన సన్నిహితులతో మాత్రం కొత్త ప్రచారాన్ని నడిపించాడు. సిద్ధిపేటలో రాజకీయ కార్యకక్రమాలు చేస్తున్నందుకే అతనిపై కక్ష గట్టి అత్యాచారయత్నం కేసులో అరెస్ట్ చేయించారని..పైగా సిద్ధిపేట నుంచి పోటీలో ఉంటానని ప్రకటించడంతో మంత్రి హరీష్ రావు చక్రధర్ ను టార్గెట్ చేసి ఈ కేసులో అన్యాయంగా ఇరికించారని సానుభూతి పొందే ప్రయత్నం చేశారు. పైగా ఇందులోకి తన సామజిక వర్గాన్ని కూడా లాగి మద్దతు పొందే ప్రయత్నం చేయించాడు. వెలమదొరల కుట్రకు గాయపడిన గౌడ బిడ్డ అని గౌడ సామజిక వర్గాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు కూడా చేశారు.
ఇదొక్కటే కాదు.. సిద్ధిపేటలో చక్రం తిప్పాలని తహతహలాడుతున్న చక్రధర్ గౌడ్ మోసాల చిట్టా రాస్తే రామాయణం..చెబితే భారతంలా మారుతుందని స్థానికంగా ఆరోపణలు వస్తున్నాయి. చక్రధర్ గౌడ్ హైదరాబాద్ నాగార్జున సర్కిల్ ఎదురుగా ఉన్న మహీంద్రా షోరూమ్ పక్క బిల్డింగ్ లోని ఐదవ అంతస్తులో ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్ నడుపుతున్నాడు. అదే బిల్డింగ్ లోని మూడో అంతస్తులో ఒక కన్సల్టెన్సీ పేరుతో ఆఫీస్ నడుపుతున్నాడు. అందులో తనకు నమ్మకస్తులైన యువతీయువకులను ఉంచి బోగస్ కంపెనీని రన్ చేస్తున్నారు. పలు ప్రాజెక్టుల పేరుతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి అమాయక యువతీ,యువకుల నుంచి డబ్బులను వసూళ్లు చేయడం చక్రధర్ గౌడ్ కంపెనీ టార్గెట్ అట. ఇందుకోసం ఓ వ్యక్తి నుంచి 100-150వరకు ఆక్టివేట్ చేయబడిన సిమ్ లను తెప్పించుకుంటాడని తెలుస్తోంది. నౌకరి.కం లాంటి సైట్లలో ఉద్యోగాలకు అప్లై చేసుకున్న నిరుద్యోగుల వివరాలను సేకరించి వారి అవసరాన్ని క్యాష్ చేసుకోవడంలో చక్రధర్ గౌడ్ కంపెనీ నెంబర్ వన్ అని అంటున్నారు. వారి నుంచి డబ్బులను వసూళ్లు చేసిన అనంతరం సిమ్ కార్డులను విరిచి పడేసి ఎవరికీ దొరక్కుండా చీకటి వ్యాపారం కొనసాగిస్తున్నారు.
చక్రధర్ తాను కొల్లగొట్టిన సొమ్ము అంతా.. తనకు మేనల్లుడి వరుసయ్యే శ్రావణ్ గౌడ్, నాగరాజు గౌడ్ల అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాడని.. వీరిద్దరినీ విచారిస్తే చక్రధర్ గౌడ్ చీకటి లెక్కలన్నీ బయటకు వస్తాయని జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. ఇదే కాదు.. గతంలో చక్రధర్ గౌడ్ దొంగ నోట్లు ముద్రణ కేసులో జైలుకు కూడా వెళ్ళాడు.
ఆ సమయంలో పోలీసులకు రాసిన కంప్లైంట్ లెటర్ బయటకు రావడంతో అతనిలో ఎవరికీ కనిపించని విలన్ క్యారక్టర్ తాజాగా బయటపడింది.కంప్లైంట్ లెటర్ లో తన తండ్రి ప్రోక్లయినర్ డ్రైవర్ గా పేర్కొన్నాడు. తాను చిన్న ఉద్యోగినని తెలిపాడు. తన పరిచయస్తుల ద్వారా ఈ దొంగ నోట్ల ముద్రణకు అలవాటు పడినట్లు పేర్కొన్నాడు. దీనిని సునిశితంగా గమనిస్తే చక్రధర్ గౌడ్ సామాన్య కుటుంబానికి చెందినవ్యక్తిగా క్లియర్ గా అర్థం అవుతోంది. మరి అలాంటి వ్యక్తి అనతి కాలంలో ఇంతలా ఎలా ఎదిగాడో అర్థం చేసుకోవచ్చు.
అయితే.. ఇటీవలి రేప్ అటెంప్ట్ కేసులో అరెస్ట్ అయిన చక్రధర్ గౌడ్.. ఇక బండారం బయటపడుతుందని..తన చరిత్రను మొత్తం ప్రభుత్వ పెద్దలు వెలికితీస్తారాని భయపడే ఆయన బీజేపీని ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది.