Polytricks.in

కాంగ్రెస్‌లో చేరికల జోరు… కారు పార్టీ బేజారు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో రాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారింది. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో పార్టీలు ప్రచార హోరును పెంచుతున్నాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పార్టీలన్నీ పావులు కదుపుతున్నాయి. హ్యాట్రిక్‌ విజయం కోసం అధికార బీఆర్‌ఎస్‌ ప్రణాళికను సిద్ధం చేసుకొగా… కాంగ్రెస్, బీజేపీ సైతం విజయం కోసం సై అంటున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుడడంతో రాజకీయ పార్టీలల్లో చేరికల కొలహాలం మెుదలైంది. వార్డు మెంబర్‌, సర్పంచ్‌ల నుంచి మెుదలుకొని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతల వరకు పార్టీలు మారుతున్నారు. బీఆర్ఎస్‌ నుంచి కాంగ్రెస్‌, బీజేపీకి… కాంగ్రెస్‌, బీజేపీ నుంచి బీఆర్‌ఎస్‌కు ఇలా వలసల పర్వం కొనసాగుతోంది.  పార్టీలో నేతలకు ఇచ్చే ప్రాధాన్యతను బట్టి నేతలు వేర్వేరు పార్టీలలో చేరుతున్నారు.
రాష్ట్రంలో హ్యాట్రిక్‌ విజయమే లక్ష్యమని చెబుతున్న బీఆర్‌ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ నుంచి కొంతమంది నేతలు బీజేపీ, కాంగ్రెస్‌లోకి చేరారు. ఇప్పుడు బీజేపీలోకి చేరికలు ఆగిపోయాయి. కాంగ్రెస్‌లోకి వలసలు పెరిగిపోయాయి. ఇప్పుడు ప్రధానంగా అందరూ కాంగ్రెస్‌ వైపే మొగ్గుచూపుతున్నారు. బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ రంగంలోకి దిగి… ఎన్నికల ప్రచారం చేస్తున్న తరుణంలో పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
పదేళ్ల కేసీఆర్‌ పాలనపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పదేళ్ల నుంచి పార్టీలో కష్టపడి పని చేస్తున్న నేతలకు సరైన ఆదరణ, ప్రాధాన్యత లభించడం లేదని  పలువురు నేతలు గుర్రుగా ఉన్నారు. జనంలో వ్యతిరేకత ఉన్నా… అధిష్ఠానం పట్టించుకోకుండా పాత వారికే టికెట్లు కేటాయించడంతో ఆశావహులు మండిపడుతున్నారు. ఇలాగైతే కష్టమే అని పెదవి విరుస్తున్నారు.
కారు పార్టీలో అసమ్మతి జ్వాలలు రగులుతున్నాయి. ఇప్పటికే కొంతమందికి టికెట్లు ఇవ్వడంతో టికెట్ల పంచాయితీ రచ్చకెకింది. టికెట్‌ దక్కని వారు, వారి అనుచరులతో కలసి పార్టీని వీడుతున్నారు. ఇదే తరుణంలో పార్టీలో సరైన ఆదరణ లభిస్తుందా లేదా అని నేతలు నిరాశతో ఉన్నారు.  మరోవైపు ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా నేతలు… బీఆర్‌ఎస్‌ను వీడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తున్న నేతలు… కాంగ్రెస్‌లోకి చేరుతున్నారు. కారు దిగి హస్తం గూటికి చేరుతున్నారు.
తాజాగా హైదరాబాద్‌లోని షాద్‌నగర్‌లో బీఆర్‌ఎస్‌కు గట్టి షాక్‌ తగిలింది. ఇప్పటివరకు బీఆర్‌ఎస్‌లో ఆశించిన మేరకు ప్రాధాన్యత దక్కని నేతలు కాంగ్రెస్‌లోకి చేరేందుకు సిద్ధమయ్యారు. షాద్‌నగర్‌ మాజీ ఎమ్మల్యే ప్రతాప్‌ రెడ్డితో పాటు కేశంపేట జడ్పీటీసీ విశాల శ్రవణ్‌ రెడ్డి, ఫరూఖ్‌నగర్‌ జడ్పీటీసీ వెంకట్‌ రామ్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ మామిడి శ్యాంసుందర్‌ రెడ్ది, మైనార్టీ నాయకుడు జమ్రత్‌ ఖాన్‌తో పాటు పలువురు సర్పంచ్‌లు రాహుల్‌గాందీ సమక్షంలో కాంగ్రెస్‌ గూటికి చేరారు.
తెలంగాణలో ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీలో కొత్త ఉత్సాహం నెలకొంది. ఇతర పార్టీల నేతల భారీ చేరికలతో పార్టీ పుల్‌ జోష్‌లో ఉంది. కాంగ్రెస్‌ పార్టీ ఇస్తున్న డిక్లరేషన్‌లకు ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తోంది. రైతులు, మహిళలు, నిరుద్యోగులే లక్ష్యంగా హస్తం పార్టీ తన ఎన్నికల ప్రచార వ్యూహాలు అమలు చేస్తోంది. డిక్లరేషన్లకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పార్టీకి రోజు రోజుకు ప్రాధాన్యత పెరుగుతోంది.
తెలంగాణలో అధికార పార్టీ బీఆర్‌ఎస్‌కు హస్తం పార్టీనే ప్రత్యామ్నయం అన్న రితీలో దూసుకుపోతోంది. విజయమే లక్ష్యంగా పని చేస్తున్న హస్తం పార్టీ తన ఎన్నికల మేనిఫాస్టోలో హామీల వర్షం కురిపిస్తోంది. బీఆర్‌ఎస్‌, బీజేపీలను అధిగమిస్తూ తెలంగాణలో అధికారమే ఎజెండాగా…. కాంగ్రెస్‌ పార్టీ ప్రచారంలో దూసుకుపోతోంది. ఇందుకోసం ఏకంగా హస్తం అగ్ర నేతలు బరిలోకి దిగి ప్రచారపర్వం కొనసాగిస్తున్నారు. ఉద్యమాల గడ్డ తెలంగాణ ఎన్నికల బరిలో విజయకేతనం ఎగురువేసేందుకు రాహుల్‌గాందీ, ప్రియాంక గాంధీలు కాంగ్రెస్‌ విజయభేరి పేరుతో బస్సుయాత్ర జోరుగా నిర్వహిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ జెండా ఎగరేస్తామని కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు
Exit mobile version